బిజెపి పరాభవానికి ఆ నినాదమే బాగా పనిచేసిందిః సచిన్ పైలట్
‘40% కమిషన్ గవర్నమెంట్’ అంటూ కాంగ్రెస్ నినదించిందన్న సచిన్ పైలట్
బెంగళూరుః కర్ణాటకలో బిజెపిని ఓడించేందుకు తమ పార్టీ ఇచ్చిన ఓ నినాదం బాగా పనిచేసిందని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ అన్నారు. కర్ణాటకలో కాంట్రాక్టర్ల నుంచి బిజెపి సర్కారు 40 శాతం చొప్పున కమీషన్లు వసూలు చేసిందని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని చెప్పారు.
జన్ సంఘర్ష్ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సచిన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘40% కమిషన్ గవర్నమెంట్’ అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాదాన్ని కర్ణాటక ప్రజలు అంగీకరించారని సచిన్ పైలట్ అన్నారు. బిజెపి ఘోర పరాభవానికి ఆ నినాదమే బాగా పనిచేసిందని సచిన్ పైలట్ చెప్పారు. కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దేశంలో బిజెపి పతనానికి నాంది అని పైలట్ అన్నారు.