హైదరాబాద్ లో ఒకే రోజు రెండు విషాద ఘటనలు

హైదరాబాద్ నగరంలో ఒకే రోజు రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి భవానీనగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకోగా..బోరబండ పీఎస్‌ పరిధి రాజ్‌నగర్‌లో ఓ స్కూల్‌ టీచర్‌ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరి వేసుకుంది. ఈ రెండు ఘటనలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపాయి.

బోయిన్‌పల్లికి చెందిన శ్రీకాంత్ చారి (42)కి భూదాన్‌ పోచంపల్లికి చెందిన అక్షయకు 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి స్రవంతి (8), శ్రావ్య (7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ సిల్వర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు మాదిరిగానే కుటుంబ సభ్యులంతా కలిసి గురువారం రాత్రి భోజనం చేసి నిద్రించారు. ఉదయం లేచి చూస్తే పిల్లలతో సహా శ్రీకాంత్ విగతజీవిగా పడి ఉన్నాడు. ఇది గమనించిన భార్య..ఇరుగుపురుగు వారికీ చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు స్థానికులను వీరి గురించి అడిగితెలుసుకున్నారు. భర్త, పిల్లలు ప్రాణాలు తీసుకోవడం పట్ల భార్య అక్షయపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో కలహాలు లేదంటే ఆర్థిక వ్యవహారాలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

ఇక బోరబండ పీఎస్‌ పరిధి రాజ్‌నగర్‌లో ఓ టీచర్ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఉరి వేసుకుంది.బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో జ్యోతి టీచర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త విజయ్‌ సెంట్రింగ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం జ్యోతి (31), పిల్లలు అర్జున్‌ (4), ఆదిత్య (2)లకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.