Exit Polls 2024 : తెలంగాణలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే..
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/06/tg-exit.jpg)
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. సాయంత్రం 6.30కు ఎగ్జిట్పోల్స్ నిర్వహించిన వివిధ మీడియా, సర్వే సంస్థలు ఫలితాలను వెలువరించాయి. ఏడో విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వివిధ సంస్థలు తమ అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ లో 17 స్థానాలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజెపి – కాంగ్రెస్ పార్టీల మధ్య తగ్గ పోరు ఉండబోతుందని అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఇండియా టుడే, జన్ కీ బాత్, ఆరా మస్తాన్, న్యూస్-18, ఏబీపీ న్యూస్ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరీ తప్పదని తేల్చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ నెక్ టు నెక్ ఫైట్ మధ్య ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మూడవ స్థానానికే పరిమితం అవుతోందని అంచనా వేశాయి.
ప్రముఖ ప్రైవేట్ టీవీ ఛానెల్ టీవీ-9 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేయగా..బీజేపీ 7 చోట్ల విజయం సాధిస్తుందని పేర్కొంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితం అవుతోందని వెల్లడించింది. ఎంఐఎం తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందని తెలిపింది. ఆరా సంస్థ సైతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించింది. బీజేపీ 8-9 సీట్లు, కాంగ్రెస్ 7-8, ఎంఐఎం 1 చోట విజయం సాధిస్తుందని, బీఆర్ఎస్కు మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా రాదని అంచనా వేసింది.