లోయ‌లో ప‌డిన టూరిస్ట్ బ‌స్సు..ఆరుగురు మృతి

భువనేశ్వర్‌: ఒడిశాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గంజామ్‌-కందమాల్‌ సరిహద్దుల్లోని కళింగ ఘాట్‌ వద్ద ప్ర‌యాణికుల‌తో వెళుతోన్న టూరిస్ట్ బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 42 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు వున్నారు. బస్ ప్రమాదాన్ని గుర్తించినవారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

ముందుగా గాయపడిన వారిని కాపాడి దగ్గర్లోని బెర్హమ్​పుర్​ ఎంకేసీజీ ఆసుపత్రికి, మరికొందరిని భంజానగర్​ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడని… ఘాట్ రోడ్డుపై బ్రేకుల్లేకుండా డ్రైవింగ్ అసాధ్యం కాబట్టి బస్సు బోల్తాపడినట్లు ప్రాథమికంగా నిర్దారించారు అధికారులు. అయితే పూర్తి దర్యాప్తు అనంతరం ఈ టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గల కారణాలు బయటపడతాయని పోలీసులు వెల్లడించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/