కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. సోనియా తల్లి పోలా మైనో కన్నుమూశారు. ఇటలీలో ఈ నెల 27వ తేదీన కన్నుమూశారని, ఆమె అంత్యక్రియలను మంగళవారం(ఆగస్టు 30న) జరిపినట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. కాగా, తల్లి అంత్యక్రియలకు సోనియా గాంధీ.. ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది.

సోనియా గాంధీ మాతృమూర్తి పౌలా మైనో వయసు 90ఏళ్లు పైనే ఉంటుంది. వయసుపై బడటం వల్ల కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో మంచానపడ్డ తల్లిని చూసేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆగస్టు 23న ఇటలీ వెళ్లారు. రాహుల్‌గాంధీ , ప్రియాంకాగాంధీ కూడా అమ్మమను చూసేందుకు తల్లి సోనియా వెంట వెళ్లిన విషయం తెలిసిందే. పౌలా మైనో మరణంపై కాంగ్రెస్ పార్టీ కూడా ట్విట్టర్‌లో సంతాపం తెలియజేసింది. ‘కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో మరణంపై కాంగ్రెస్ కుటుంబం ప్రగాఢ సంతాపం తెలుపుతోంది.. మరణించిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం’ అని పేర్కొంది.