దావోస్ నుంచి పెట్టుబడులు రావొద్దనే బాబు గ్యాంగ్ విధ్వంసకాండ

మంటలు రాజేసి ప్రజాభిమానం పొందాలనుకోవడం వృథా ప్రయాసేనని విజయసాయిరెడ్డి కామెంట్

అమరావతి : వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రావొద్దనే కోనసీమలో చంద్రబాబు గ్యాంగ్ విధ్వంసకాండకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిస్థితి బాగా లేదన్న కళంకం తెచ్చేందుకే ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు.

అంబేద్కర్ ను అవమానిస్తే జాతి క్షమించదని, రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోతారని మండిపడ్డారు. మంటలు రాజేసి ప్రజాభిమానం పొందాలని చూడడం వృథా ప్రయాసేనని అన్నారు. నిప్పుతో చెలగాటం మంచిది కాదని, ఇలాంటి కుట్రలకు పాల్పడిన వారంతా చరిత్ర హీనులుగా మిగిలారని పేర్కొన్నారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం దగ్గర్నుంచి.. చంద్రబాబు చేసిన అనేక అరాచకాలను జనం మరచిపోలేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. కేసుల్లో ఇరుక్కోవడం తప్ప.. రెచ్చగొట్టి సాధించేదీ ఏమీ లేదని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/