దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది : సీఎం జగన్
అమరావతి: సీఎం జగన్ నేడు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ..దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని అన్నారు. 15.61లక్షల మంది రైతులకు రూ.2977.92 కోట్లను అందిస్తున్నాం. ఒకప్పుడు అనంతపురం కరువు జిల్లా. ఇవాళ దేవుడి దయ వల్ల నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. గత ప్రభుత్వానికి – మన ప్రభుత్వానికి తేడా గమనించండి. ఇంతకుముందు ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బటన్ నొక్కగానే లబ్దిదారుల ఖాతాల్లో బీమా సొమ్ము జమ అవుతోంది. ఈ మార్పును గమనించాలని కోరుతున్నా.
మన ప్రభుత్వంలో పారదర్శకంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి మంచి జరుగుతోంది. మనిషికి బీమా ఉన్నట్లే పంటకు బీమా ఉండకపోతే రైతు పరిస్థితి ఏంత దయనీయంగా ఉంటుందో గత ప్రభుత్వ హయాంలో చూశామని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.3,411 కోట్ల పంట బీమా మాత్రమే ఇచ్చారు. మన ప్రభుత్వ మూడేళ్ల హయాంలో మూడేళ్లలోనే రూ.6,685 కోట్ల బీమా చెల్లించాం. రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మనమే తీర్చాం. ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
రైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీ పడుతున్నాం. మన రాష్ట్రంలో జరగుతున్న మార్పులను పక్క రాష్ట్రాలు వచ్చి చూస్తున్నాయి. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు చెల్లించాం. రైతన్నల కోసం మూడేళ్లలో రూ.1,27,823 కోట్లు ఖర్చు చేశాం. దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఆర్బీకేలు రైతన్నను పట్టుకొని నడిపిస్తున్నాయి. మూడేళ్లలో రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ. 25,800 కోట్లు ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వం రూ.8750 కోట్లు పెట్టిన ఉచిత విద్యుత్ బకాయిలను తీర్చాం. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. పంటల బీమా పథకంపై దృష్టి పెట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చామని సీఎం జగన్ అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/