వారు మాకు మద్దతు ఇస్తారు.. కానీ వారి ఓట్లు మాకక్కర్లేదు: సీఎం హిమంత బిస్వా శర్మ
అస్సాం: బాల్య వివాహాలు అరికట్టే వరకు ‘మియా’ సామాజికవర్గ ఓట్లు బిజెపి కి అవసరం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాల్య వివాహాలను వ్యతిరేకించి తమను తాము సంస్కరించుకునే వరకు చార్ ప్రాంతంలో ఉన్న మియా ప్రజల ఓట్లు పదేళ్ల వరకు అక్కర్లేదని స్పష్టం చేశారు. అయితే ఆ ప్రాంత ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. “బిజెపి ప్రజా సంక్షేమం కాంక్షిస్తుంది. వారు మాకు మద్దతు ఇస్తారు. కానీ వారి ఓట్లు మాకక్కర్లేదు. బిజెపి కి మద్దతు ఇవ్వకపోయిన పెద్దగా జరిగే నష్టం లేదు” అని అన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడు తమకు ఓటేయవద్దని తానే అభ్యర్థిస్తానని, కుటుంబ నియంత్రణ పాటించి, బాల్య వివాహాలను అరికట్టి, మత ఛాందసవాదాన్ని వదిలేసిన నాడే తమకు మద్దతుగా నిలవాలని తెలిపారు. ఇవన్నీ జరగడానికి 10 ఏళ్లు పడుతుందని చెప్పారు. బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా నివసించే ‘చార్ల’ ప్రాంతంలో సరైన పాఠశాలలు లేవని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు బడులు లేవని తెలిస్తే వాటిని వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో మైనారిటీలు ఉన్న ప్రాంతాల్లో 7 కాలేజీలు ప్రారంభిస్తామని చెప్పారు. ‘మియా’ అనేది బెంగాలీ మాట్లాడే ముస్లింల ను సూచించడానికి ఉపయోగపడే పదం.