బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ రావు

పల్లవి ప్రశాంత్ అందరి ఇళ్లలో ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయాడని ప్రశంస

harish-rao-thanneeru-congratulates-siddipet-raithu-bidda-pallavi-prasanth

హైదరాబాద్‌ః బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ‘బిగ్ బాస్ విజేతగా నిలిచిన మా సిద్దిపేట రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు శుభాకాంక్షలు’ అని బిఆర్ఎస్ సీనియర్ నేత ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బిగ్ బాస్ షోలో తన ప్రదర్శన ద్వారా పల్లవి ప్రశాంత్ అందరి ఇళ్లలో ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయాడని ప్రశంసించారు. సీజన్ ఆసాంతం సామాన్యుడి దృఢమైన సంకల్పానికి ప్రతీకగా నిలిచాడని కొనియాడారు. పంటపొలాల నుంచి బిగ్ బాస్ షో వరకు సాగిన అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను దోచుకుందని పేర్కొన్నారు.

బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అందర్నీ ఆకట్టుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కరలేని వ్యక్తిగా నిలిచాడు. ఒక యూట్యూబర్‌గా, ఒక ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన ఇతను ఓ రైతు బిడ్డ. తన ఆటతో ప్రేక్షకుల మనసులను గెలిచి విజేతగా నిలిచాడు. ఇతనిది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్లూరు. తండ్రి సత్తయ్య రైతు.