తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాసు పట్టుకొని భ్రమలో ఉన్నారు – అమర్నాధ్

టిడిపి – జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల ఫై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాసులకు గోల్డ్ కవరింగ్ ఇస్తూ.. తాము బలంగా ఉన్నామన్న భ్రమలో జనసేన, టీడీపీ పార్టీలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.

గత ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి మేము ఓట్లు అడుగుతామని చెప్పారు. అదే జనసేన, టీడీపీ పార్టీలు ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తే బలమని భావిస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. కేవలం 24 సీట్లు మాత్రమే జనసేనకి ఇచ్చి చంద్రబాబు చేతులు దులుపుకొన్నారని, జనం కోరితే తాను ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సీట్లతో ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారని, ఆ పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారని అమర్నాథ్ ప్రశ్నించారు.

జనసేన, టిడిపి ఉమ్మడి జాబితాలో సోషల్ ఇంజనీరింగ్ జరిగిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అక్కడ సోషల్ ఇంజనీరింగ్ కన్నా ప్యాకేజీ ఇంజనీరింగ్ కనిపించిందని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయాన్ని స్పష్టత ఇవ్వలేదని అమర్నాథ్ అన్నారు.