తెలంగాణ లో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా..
గ్రూప్ 2 అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్. మరోసారి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. పోలింగ్కు, ఇటు పరీక్షలకు పెద్ద ఎత్తున పోలీసులతో పాటు ఇతర శాఖల సిబ్బంది కేటాయింపు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడం తో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
వాయిదా వేసిన పరీక్షలను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. 783 గ్రూప్-2 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ను విడుదల చేసింది. జనవరి 18 నుంచి దరఖాస్తుల ప్రక్రియ చేపట్టింది. దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగాల్సి ఉండగా.. నవంబర్ 2, 3 తేదీలకు వాయిదాపడ్డాయి. పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల వల్ల వాయిదా పడ్డాయి.