తెలంగాణ గ్రూప్ 2 పోస్టులకు ఎన్ని లక్షల దరఖాస్తులు అందాయో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర సర్కార్ వరుస జాబ్ నోటిఫికెషన్స్ విడుదల చేస్తూ నిరుద్యోగుల్లో ఆనందం కనపరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. తాజాగా గ్రూప్ 2 కు సంబదించిన దరఖాస్తుల స్వీకరణ నిన్నటి తో పూర్తి అయ్యింది. మొత్తం 783 పోస్టులకు గాను రాష్ట్రవ్యాప్తంగా 5,51,901 మంది దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్​పీఎస్​సీ తెలిపింది.

వీటికి జనవరి 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. చివరి మూడు రోజుల్లో 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయని , గడువు ముగిసే సమయానికి చివరి 24 గంటల వ్యవధిలో 68 వేలకు పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపింది. గడువు ముగియగానే టీఎస్‌పీఎస్సీ ‘ఆన్‌లైన్‌’ లింకును తొలగించింది. కొందరు అభ్యర్థుల ఫీజు చెల్లింపులు సర్వర్‌ నుంచి ఖరారైన తరవాత మొత్తం దరఖాస్తుల సంఖ్యలో స్వల్పమార్పులు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. నిర్దేశిత గడువులోపు కమిషన్‌కు అందిన దరఖాస్తుల ప్రకారం ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీ పడనున్నారు.