మహబూబాబాద్ జిల్లాలో విషాదం..తెల్లారితే పెళ్లి..ఇంతలోనే వరుడు మృతి

తెల్లారితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లి కొడుకు పాడె ఎక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం తండాకు చెందిని భూక్యా బాలాజీ, కాంతి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు యాకూబ్(21) హైదరాబాద్ లో రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పెయింటర్ గా పని చేస్తున్నాడు.

ఇటీవల గార్ల మండలానికి చెందిన యువతితో యాకూబ్ కు వివాహం కుదిరింది. పెళ్లి కోసం యాకూబ్ సెలవులపై ఇంటికి వచ్చాడు. శుక్రవారం పెళ్లి జరగాల్సివుండగా ఇంట్లో బంధువులతో పెళ్లి సందడి నెలకొంది. గురువారం ఇంట్లో నీళ్లు అయిపోవడంతో బోర్ మెటర్ స్విచ్ వేస్తున్న క్రమంలో యాకూబ్ విద్యుత్ షాక్ కు గురై కిందపడిపోయాడు. వెంటనే బంధువులు, స్థానికులు చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే యాకూబ్ మృతి చెందాడు. తెల్లారితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.