ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించిన కేంద్రం!

అక్టోబర్ 16వ తేదీ దాకా ఆంక్షలు

govt-imposes-20-per-cent-export-duty-on-parboiled-rice

న్యూఢిల్లీః ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై 20 శాతం సుంకం విధించింది. దేశంగా ధరలను అదుపులో ఉంచేందుకు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి 20 శాతం సుంకం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అక్టోబర్ 16వ తేదీ దాకా ఈ ఆంక్షలు కొనసాగుతాయని వివరించింది. ఇప్పటికే కస్టమ్స్‌ పోర్టుల్లో లోడ్‌ చేసి ఉంచిన పారాబాయిల్డ్ రైస్‌కు ఈ సుంకం వర్తించదని వెల్లడించింది. ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ ఉన్న ఎగుమతులకూ సుంకం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.

ఇటీవల బాస్మతి యేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేదం అమల్లోకి తెచ్చింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, పాలిష్ చేయని తెల్ల బియ్యం ఎగుమతులకు ఈ నిషేధం వర్తిస్తుంది. దీంతో ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరిగింది. వీటి ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎగుమతులను అదుపులో ఉంచేందుకు ఈ సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదల నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని కేంద్రం ఇటీవల విధించింది. మరోవైపు అక్టోబర్ నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.