నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారు – తమిళిసై

భారత 75 వ గణతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై గణతంత్ర దినోత్సవం సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసారు. గత BRS ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ‘అహంకారం, నియంతృత్వ పాలనను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రజాస్వామ్య స్పృహతో పాలన జరుగుతోంది’ అని పేర్కొన్నారు.

అలాగే రైతులకు , నిరుద్యోగ యువతకు తీపి కబురు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రూ.2,00,000 రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే TSPSC ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఉద్యోగాల భర్తీపై యువత ఎలాంటి అపోహలకు గురికావొద్దని సూచించారు. అంతకు ముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. అలాగే పోలీసులు, సైనికుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు.