కేటీఆర్ కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీసిన గవర్నర్ తమిళి సై ..

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గత గురువారం రాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక విరిగింది. దీంతో యశోద హాస్పటల్ వైద్య బృందం శుక్రవారం సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేసారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీస్తూ..ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే అనేక పార్టీల అధినేతలు , సినీ ప్రముఖులు..కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న యశోద హాస్పటల్ కు వెళ్లి ఆయన్ని పరామర్శించి..ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలో గవర్నర్ తమిళి సై సైతం కేసీఆర్ తనయుడు , మాజీ మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీశారు. కేసీఆర్ ప్రస్తుత హెల్త్ కండీషన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో కేసీఆర్ పూర్తిస్థాయి ఆరోగ్యంతో కోలుకుంటారని గవర్నర్ తమిళి సై ఆశాభావం వ్యక్తం చేశారు.