కెసిఆర్ కిట్లో నేత చీరలు ఇవ్వండి..మంత్రికి వినతి

హైదరాబాద్: అఖిల భారత పద్మశాలీ సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు గుండేటి శ్రీధర్, తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ను కలిశారు. ఈసందర్భంగా వారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కెసిఆర్ కిట్లో చేనేత చీరెలు ఇవ్వాలని మంత్రి ఈటల రాజేందర్ను కోరారు. ఈ మేరకు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో పని లేక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, చేనేత పరిశ్రమ దిక్కుతోచని స్థితిలో పడిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చేనేత సహకార సంఘాల నుంచి, చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసి జీవన భృతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన మహిళలకు ఇస్తున్న కెసిఆర్ కిట్లో పాలిస్టర్ చీరెకు బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే కాటన్ చేనేత చీరెలు ఇచ్చేలా చూడాలని కోరారు. ఈ మేరకు స్పందించిన మంత్రి ఈటల సాధ్యమైనంత త్వరలోనే విధి విధానాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని వైద్య కార్యదర్శికి లేఖను పంపారు. చేనేత కార్మికులకు తనవంతు సహకారం అందిస్తానని భరోసా కల్పించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/