గన్నవరం టిడిపి ఇంఛార్జ్‌గా యార్లగడ్డ : నారా లోకేశ్

గన్నవరం కంచుకోటపై టిడిపి జెండా ఎగురవేయడం ఖాయమని వ్యాఖ్య

gannavaram-tdp-incharge-yarlagadda-venkat-rao

అమరావతిః గన్నవరం టిడిపి ఇంఛార్జ్‌గా కేడీసీసీ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావును ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం ప్రకటించారు. లోకేశ్ యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు లోకేశ్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా యార్లగడ్డను నియమించినట్లు ప్రకటించారు.

తనను ఇంఛార్జ్‌గా ప్రకటించిన అనంతరం యార్లగడ్డ మాట్లాడుతూ… గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఓటమి కోసం తామంతా కలిసికట్టుగా పని చేస్తామన్నారు. ఇది టిడిపి కంచుకోట అని, ఇక్కడ టిడిపి జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. వల్లభనేని వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు పలికినప్పటికీ టిడిపి శ్రేణులు మాత్రం ఆయన వెంట నడవలేదన్నారు. తాము రౌడీయిజం చేయడానికి రాలేదని, రాజకీయం చేయడం కోసం వచ్చామన్నారు. కొత్త, పాత కలయికలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా తన వద్దకు వచ్చి చెప్పుకోవచ్చునన్నారు.