తెలంగాణలో మరో దారుణం : గంజాయికి డబ్బులు ఇవ్వలేదని మైనర్ బాలుడికి చిత్రహింసలు

ఇప్పటికే వరుస విద్యార్థుల ఆత్మహత్యలు , ప్రేమకోసం హత్యలు వంటి వార్తలతో గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రం క్రైమ్ వార్తల్లో నిలుస్తుండగా..తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ గంజాయి బ్యాచ్..డబ్బుల కోసం ఓ మైనర్ బాలుడ్ని చిత్రహింసలకు గురి చేసిన ఘటన బయటకొచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో కొంతమంది యువత గంజాయికి అలవాటుపడ్డారు. గంజాయి కొనేందుకు డబ్బుల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేయడం..వ్యక్తులను బెదిరించి డబ్బులు లాక్కోవడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. కిరాణా దుకాణంలో కూర్చున్న యువకుడిని గంజాయ్ బ్యాచ్ బలవంతంగా సమీపంలోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. అనంతరం గంజాయికి డబ్బులు ఇవ్వాలంటూ బాలుడి బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారు‌. ఈ క్రమంలో అర్ధరాత్రి గంజాయి గ్యాంగ్‌ నుంచి ఎలాగో తప్పించుకొని బాలుడు తన ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. ఒంటిపై గాయాలను చూసిన బాలుడి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై బాలుడి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మహమ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్‌తోపాటు మరో ఐదుగురిపై బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇద్దరిని హత్య చేశాం.. నిన్ను కూడా చంపేస్తా.. ఎక్కడైనా చెప్పుకో అంటూ గంజాయ్ గ్యాంగ్‌ బాలుడిని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలసీులు గంజాయి బ్యాచ్ కోసం వేట మొదలుపెట్టారు.