వైస్సార్సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డికి భారీ ఊరట..

వైస్సార్సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనపై గతంలో ఉన్న ఓ కేసును న్యాయస్థానం కొట్టేసింది. 2015లో తొండూరులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు తమను పోలీసులు చిత్రహింసలు పెట్టారని కర్నాటక సరిహద్దుల్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి మృతదేహాలతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సహా పలువురు తొండూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.

దీంతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఏ1గా, వైఎస్‌ వివేకానందరెడ్డి ఏ2గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి సహా 94 మందిపై కేసులు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం నాటి విచారణ కోసం పులివెందుల నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైస్సార్సీపీ కార్యకర్తలు విజయవాడ కోర్టుకు రాగా.. చంచలగూడ జైలు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. దీంతో ఈ కేసుపై గురువారం విచారణ జరిపిన కోర్టు.. సాక్ష్యాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. కోర్ట్ తీర్పుతో వైస్సార్సీపీ శ్రేణులు సంబరాల్లో ఉన్నారు.