హైదరాబాద్ లో నిమజ్జనానికి తరలిస్తుండగా కూలిన గణపతి విగ్రహం

నవరాత్రులు పూజలు అందుకున్న గణనాధుడు..నిమజ్జనానికి బయలుదేరాడు. కాగా హిమాయత్‌నగర్‌లో గణేశ్‌ విగ్రహం కూలిపోయింది. కర్మాన్‌ఘాట్‌లో టీకేఆర్‌ కాలేజీ వద్ద 20 అడుగుల గణేశ్ మట్టి విగ్రహం ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌కు తీసుకొస్తున్నారు. ఈక్రమంలో రాత్రి వర్షం కురువడంతో గణనాథుడు తడిసిపోయాడు. దీంతో హిమాయత్‌నగర్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎదుట గణేశ్‌ పడిపోయింది. దీంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు.

ఇక నగర వ్యాప్తంగా గణపతి నిమజ్జన వేడుకులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చడానికి మండపాల నుంచి తీసుకువెళ్తున్నారు. దారి పొడవునా బ్యాండ్ బాజాలతో, నృత్యాలతో కోలాహలం చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. నగరంలో జరుగుతున్న వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.