బిఆర్ఎస్‌ నేత హరీశ్ రావు మాజీ పీఏ అరెస్ట్

Former PA of BRS leader Harish Rao arrested

హైదరాబాద్‌ః మాజీ మంత్రి, , బిఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు మాజీ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) ను హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల దుర్వినియోగం కేసులో హరీశ్ రావు పీఏ నరేశ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, అనర్హులకు చెక్కులు అందించారని మెదక్ జిల్లా నారాయణఖేడ్ కు చెందిన రవినాయక్ ఫిర్యాదు చేశారు. తనకు మంజూరైన రూ.5 లక్షల చెక్కును నరేశ్ కుమార్ కాజేశాడని ఆరోపించాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ తర్వాత నరేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

బిఆర్ఎస్ హయాంలో మంత్రి హరీశ్ రావు ఆఫీసులో నరేశ్ కుమార్, మరో ముగ్గురు ఆఫీసు సిబ్బంది సీఆర్ఎంఎఫ్ విభాగంలో పనిచేశారు. ఈ క్రమంలోనే చెక్కుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రాథమికంగా ఆధారాలు లభించినట్లు సమాచారం. రవినాయక్ కు చెందిన రూ.5 లక్షల చెక్కును క్యాష్ చేసుకుని నరేశ్, వంశీ, వెంకటేశ్, ఓంకార్ లు పంచుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వారి దగ్గర మరికొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు దొరికినట్లు సమాచారం.