ఎక్సైజ్ కానిస్టేబుళ్ల అవస్థలపై ఆర్ఎస్పీ ట్వీట్

rs-praveen-kumar-tweet-regarding-excise-constable-training

హైదరాబాద్‌ః ‘తెలంగాణలో అసలు ప్రభుత్వమనేది ఉందా.. ఎవరికైనా దాని జాడ కనిపిస్తే కాస్త చెప్పండి’ అంటూ బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ట్వీట్ చేశారు. ఎల్బీ స్టేడియంలో ఆర్భాటంగా సభ నిర్వహించి, ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు, ఆపై వారి విషయమే మరిచిపోయారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు. నియామక పత్రాలు అందుకుని నలభై రోజులు గడిచినా వారిని శిక్షణకు పంపలేదని మండిపడ్డారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లు గత నలభై రోజులుగా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు.

ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వారు లేఖ రాశారని ఆర్ఎస్పీ చెప్పారు. సదరు లేఖ ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. అయితే, మంత్రి మాత్రం తన చేతుల్లో ఏమీలేదంటూ జవాబిచ్చారని, ప్రభుత్వాన్నే అడగాలంటూ నిర్లక్ష్యంగా చెప్పారని ఆరోపించారు. అందుకే తెలంగాణలో ప్రభుత్వం ఎక్కడుందో వెతుకుతున్నామని, ఎవరికైనా కనిపిస్తే చెప్పాలంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.