మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి

సీనియర్ రాజకీయ నేత , మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతూ హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన.. మంగళవారం తుదిశ్వాస విడిచారు. దయాకర్ మృతి ఫై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ నేతలు, ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి టీడీపీ నుంచి 1994,1999లో అమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో మక్తల్ నుంచి టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. దయాకర్ రెడ్డి భార్య సీత కూడా టీడీపీ నుంచి 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దంపతులిద్దరికి టీడీపీతో మంచి అనుబంధం ఉంది.

విభజన తర్వాత కూడా పార్టీలోనే కొనసాగారు. దయాకర్‌రెడ్డి దంపతులు గతేడాది ఆగస్టులో టీడీపీకి రాజీనామా చేశారు. వీరిద్దరు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగినా.. ఆ తర్వాత ఏ పార్టీలో చేరలేదు. ఇద్దరు నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇంతలో దయాకర్ రెడ్డి అనారోగ్యానికి గురి కావడం తో ఏ పార్టీ వారు కూడా పెద్దగా పట్టించుకోలే. ఇక ఇప్పుడు దయాకర్ రెడ్డి మరణం అందర్నీ శోకసంద్రంలో పడేసింది.