విజయవాడలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య..

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. జక్కంపూడికి చెందిన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ ఆకాష్‌ ను అతి దారుణంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన దాని ప్రకారం.. వాంబే కాలనీలో రౌడీ‌షీటర్‌ టోని అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టోని అంత్యక్రియల సమయంలో ఆకాష్, ప్రభాకర్ గ్యాంగ్‌ లు పాల్గొన్నారు. అంత్యక్రియల అనంతరం వీరంతా ఓ బార్‌లో ఫుల్లుగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే టోని గ్యాంగ్‌లోని ప్రభాకర్‌ బ్యాచ్‌, ఆకాశ్‌ గ్యాంగ్‌ మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవలో ఆకాశ్‌ ..ప్రత్యర్థి గ్యాంగ్ లోని ఓ వ్యక్తి ఫై దాడి చేసాడు. ఆ తర్వాత అక్కడికి పోలీసులు వస్తున్నారని తెలిసి అక్కడినుండి వెళ్లిపోయారు.

తర్వాత మంగళవారం రాత్రి ప్రభాకర్‌ గ్యాంగ్‌.. ఆకాశ్‌ ఉంటున్న ఇంట్లోకి వెళ్లి అతడిపై దాడి చేశారు. కత్తులతో దాడి చేయడంతో ఆకాశ్‌ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆకాశ్‌ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టువార్టం నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టోని గ్యాంగ్‌పై ఫోకస్‌పెట్టారు. టోని అంత్యక్రియల్లో ఎవరెవరు పాల్గొన్నారనే అంశంపై దృష్టిసారించారు. అలాగే, ఆకాష్ మృతి కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆకాష్ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు టోర్నీల్లో కప్‌లు కూడా సాధించాడు.