తెలంగాణలో కలవరపెడుతున్న ‘కండ్లకలక’ కేసులు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో మలేరియా, డెంగ్యూ, ఫ్లూతో పాటు కండ్లకలక కేసులు హాస్పటల్స్ లలో ఎక్కువగా నమోదు అవుతుంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ, కండ్లకలక కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గత పది రోజులుగా రెండు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ లో అతి భారీ వర్షాలు పడడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటీకే ప్రభుత్వ హాస్పటల్స్ తో పాటు ప్రవైట్ హాస్పటల్స్ లలో డెంగ్యూ కేసులు నమోదు అవుతుండగా..రెండు రోజులుగా కండ్లకలక కేసులు ఎక్కువయ్యాయి అంటున్నారు డాక్టర్స్.
ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే..
సాధారణ బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి సోకుతుందని , జలుబు కారకమైన వైరస్తో కూడా కండ్లకలక వస్తుందని అంటున్నారు. వర్షాకాలం కావడంతో వాతావరణ పరిస్థితుల కారణంగా ఇన్ఫెక్షన్ సోకి కలక వస్తోందని, గాలిలో ఎక్కువగా ఉండే తేమ బ్యాక్టీరియాకు కారణమవుతోందని అంటున్నారు. కండ్లకలక అనేది చిన్న ఇన్ఫెక్షనే అయినప్పటికీ రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని , ఏ పని చేసుకోనీయకుండా ఇబ్బంది పెడుతుందని డాక్టర్స్ చెపుతున్నారు. గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వాతావరణంలో మురికి కాలుష్య కారకాలు పెరగడం వల్ల వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.
ఈ కండ్లకలక ను గుర్తించడం ఎలా..?
కంటి నుండి తరుచు నీరు కారడం, కంటి నొప్పి దురద, మంట రావడం , కంటి రెప్పలు వాపు, ఉబ్బడం, పడుకున్నప్పుడు కంటి రెప్పలు అంటుకొని ఉండడం వంటివి జరిగితే..మీరు ‘కండ్లకలక’ వ్యాధిని పడ్డట్లే.
కండ్లకలక వ్యాధిని పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఒకవేళ మీరు కండ్లకలక తో బాధపడుతుంటే..కంటిని తరుచు నీటితో కడుక్కోవాలి. కండ్ల కలక వచ్చిన వారికి దూరంగా ఉండాలి. వాళ్ళు వాడిన వస్తువులు వాడరాదు. ఈ వ్యాధి వచ్చిన వారి టవల్స్, కర్చీఫ్లు ఇతరులు వాడకూడదు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు. కండ్ల కలక వచ్చిన వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఆకు కూరలు, క్యారెట్లు, సిట్రన్ ఫ్రూట్స్ ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది.