కేసీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించిన కేంద్ర మంత్రి అమిత్ షా
మునుగోడు సభలో కేసీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు బిజెపి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…ఈరోజు బిజెపి లో చేరనున్న నేపథ్యంలో మునుగోడు లో బిజెపి సమరభేరి పేరిట భారీ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ కు తెలంగాణ బిజెపి నేతలతో పాటు బిజెపి అగ్ర నేతలు హాజరయ్యారు. ముఖ్య అతిధిగా హాజరైన అమిత్ షా..రాజగోపాల్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ..కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ సర్కార్ను పడగొట్టేందుకు నేడు రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేలా ఈ మునుగోడు సభను చూస్తుంటే అర్థమవుతోందని అన్నారు. రాజగోపాల్రెడ్డిని బీజేపీలోకి చేర్చుకునేందుకు నేను ఇక్కడికి వచ్చానని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్ గతంలో చెప్పారని, ఇచ్చిన మాటలు అమలు చేయని పాలన కేసీఆర్ది అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రిని చూస్తారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. మజ్లిస్కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ నిర్వహించడం లేదని, తాము అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇల్లు ఇస్తామన్నారు..? ఇచ్చారా? అని అమిత్ షా ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పారు.. కానీ ఇంత వరకు అలా జరగలేదన్నారు. మళ్లీ గెలిపిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారని, అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని అన్నారు. ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ చెప్పారు.. ఎంత మంది దళితులకు 10 లక్షల రూపాయలు అందాయని ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు.. ఎవరికైనా అందిందా..? అంటూ అమిత్ షా ఉద్వేగంతో ప్రశ్నించారు.
నిరుద్యోగులకు నెలనెలా రూ.3వేల భృతి, నల్గొండ జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ మంజూరు చేస్తున్న టాయిలెట్లు కూడా ప్రజలకు అందకుండా చేస్తున్నారని అమిత్ షా ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలకు పెనుమార్పునకు నాంది అన్నారు అమిత్ షా. ఇది కేవలం రాజగోపాల్ రెడ్డి చేరిక సభ కాదన్న అమిత్ షా.. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ వెళ్లిపోవడం ఖాయమన్నారు.