చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు. ఒకే కుటుంబానికి ముగ్గురు మంటల్లో కాలి బూడిదయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. చిన్నగంజాం నుంచి చీరాల మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును పసుమర్రు సమీపంలోని ఉరిపాలెం వద్ద టిప్పర్‌లారీ బలంగా ఢీకొట్టింది.

అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో తొలుత టిప్పర్‌లారీలో మంటలు చెలరేగి అవి బస్సుకు వ్యాపించాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో అందులో చిక్కుకున్న ఆరుగురు సజీవ దహనమయ్యారు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రయాణికులంతా చిన్నగంజాం, గోనసపూడి, నీలాయపాలెం గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.

బస్సు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతోపాటు బస్సు డ్రైవర్‌, టిప్పర్‌ డ్రైవర్ మంటల్లో సజీవదహనమయ్యారు. వీరిలో నీలాయపాలెంకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన కాళీ బ్రహ్మేశ్వరరావు(62), భార్య లక్ష్మీ( 58), మనవరాలు పిట్టు( 09) చనిపోయారు. డ్రైవర్ అంజి( 35). స్వల్పగాయాలతో బయటపడిన వారిని చిలకలూరిపేట, గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.