ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు

ఓ టోల్ గేట్ వద్ద ఒవైసీ కారుపై 4 రౌండ్ల కాల్పులు


హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారానికి వెళ్లిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఒవైసీ మీరట్ జిల్లా కితౌర్ లో ప్రచారం నిర్వహించారు. అయితే తన వాహనంపై 4 రౌండ్లు కాల్పులు జరిగినట్టు ఒవైసీ వెల్లడించారు. దుండగులు ముగ్గురు, నలుగురు ఉండొచ్చని తెలిపారు. చిజార్సీ టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగిందని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. కారుకు బుల్లెట్లు తగిలిన ఫొటోను కూడా పంచుకున్నారు.

కాల్పులు జరిపిన అనంతరం వారు ఆయుధాలు పడేసి పారిపోయారని, ఈ ఘటనలో తన కారు టైరుకు పంక్చర్ అయిందని ఒవైసీ వివరించారు. దాంతో తాను మరో వాహనంలోకి మారి అక్కడ్నించి క్షేమంగా బయటపడ్డానని, అల్లా దయతో ఎలాంటి ముప్పు సంభవించలేదని వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/