వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కడప పట్టణ శివారులోని రాజంపేట-కడప బైపాస్‌ రోడ్డు చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున రాజంపేట వైపు నుండి వస్తున్న బైక్‌ను లారీ వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతి చెందిన వారు చెన్నూరు బెస్త కాలనీకి చెందిన సురేష్‌, దినేష్‌, సుబ్బయ్యలుగా గుర్తించారు. ముగ్గురు యువకులు ఒంటిమిట్ట నుండి చెన్నూరుకు బైకు మీద వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న చెన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను కడప రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు.