భారీ వర్షాల ఎఫెక్ట్ : జన్మదిన వేడుకలకు దూరంగా మంత్రి కేటీఆర్‌

రేపు (జులై 24) మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా జరిపేందుకు టిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు , కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తుండగా..భారీ వర్షాల కారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్ 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు సిద్ధిపేటలో జన్మించారు. రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాదులోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. 1990-91 ఎస్‌ఎస్‌సీ, జీజీ స్కూల్‌, హైదరాబాద్‌.1991-93 ఇంటర్‌, విజ్ఞాన్‌ కాలేజీ, గుంటూరు.గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి హైదరాబాద్‌ వచ్చి మెడిసిన్‌ ఎంట్రెన్స్‌ రాసిన రామారావుకు కర్ణాటకలోని ఓ మెడికల్‌ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టంలేక నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. 1996-98 ఎమ్మెస్సీ, (బయోటెక్నాలజీ) పూణే యూనివర్సిటీ, ముంబాయి. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ 1998-2000 ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్‌ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం చూపడంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేసాడు, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందాడు. ఈ ఉప ఎన్నికల్లో కేటీఆర్ చురుకైన పాత్ర పోషించాడు. 2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నాడు. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందాడు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచాడు. 2018 డిసెంబరు 17న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనకు ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖలను కేటాయించారు.