టిడ్కో ఇళ్ల వద్ద నిల్చుని సీఎం జగన్ కు చంద్రబాబు ఛాలెంజ్

ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన.. టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర చంద్రబాబు సెల్ఫీ దిగారు. ‘‘చూడు….జగన్!.. ఇవే టీడీపీ హయాంలో.. పేదలకు కట్టించిన వేలాది టిడ్కో ఇళ్లు. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం. నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని?.. నువ్వు కట్టిన ఇళ్లెక్కడా?.. జవాబు చెప్పగలవా? ’’ అంటూ జగన్కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో చంద్రబాబు ట్వీట్ చేశారు.

శుక్రవారం నెల్లూరులో టీడీపీ జోన్-4 సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో తాము నిర్మించిన వేలాది టిడ్కో ఇళ్లను సందర్శించారు. టిడ్కో ఇళ్ల వద్ద నిల్చుని తన మొబైల్ ఫోన్ తో సెల్ఫీ దిగారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలోనూ సెల్ఫీ చాలెంజ్ లు విసురుతూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సైతం సెల్ఫీ ఫోటోతో జగన్ కు ఛాలెంజ్ విసిరారు.