ఏపీ క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పాతపాటి సర్రాజు హఠాన్మరణం

వైస్సార్సీపీ నేత , ఏపీ క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పాతపాటి సర్రాజు (72) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన.. 10 గంటల వరకు పార్టీ నాయకులతో కలిసి కొద్దిసేపు గడిపారు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. తర్వాత గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

2004లో ఉండి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించిన ఆయన, 2009లో మళ్లీ కాంగ్రెస్ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2014కు ముందు వైస్సార్సీపీ లో చేరి మళ్లీ ఉండి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సర్రాజు మృతి ఫై సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైస్సార్సీపీ నేతలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.