నల్గొండ జిల్లాలో వందే భారత్‌ రైలుకు ప్రమాదం..

తెలంగాణ లో వందే భారత్‌ రైలుకు ప్రమాదం చోటుచేసుకుంది. వందేభారత్‌ ను ఢీ కొని గేదె మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం టీక్యాతండా శివారులో చోటుచేసుకుంది.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి తిరుపతికి వెళ్తున్న వందేభారత్‌ రైలు మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో స్టాప్‌ లేకపోవడంతో పైనుంచి వచ్చే వేగంతోనే వెళుతోంది. మిర్యాలగూడ మండలంలోని టీక్యాతండా సమీపంలో ఉదయం 9గంటల ప్రాంతంలో రైలు పట్టాల పక్కన ఓ గేదె అడ్డొచ్చింది. రైలు ఢీకొనడంతో గేదె అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన డ్రైవర్‌ వెంటనే రైలును నిలిపివేసి పరిశీలించారు.

ఈ ఘటనలో రైలుకు ఎలాంటి డ్యామేజీ కాలేదని గుర్తించారు రైల్వే అధికారులు. ఘటన తర్వాత రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు.. రైల్వే ట్రాక్ పై గేదెలను పంపిస్తే.. వాటివల్ల ప్రమాదం జరిగితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను రైల్వే పోలీసులు హెచ్చరించారు.