కెసిఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి ఈ ముగింపు సభ – ఈటెల రాజేందర్

కెసిఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి ఈ ముగింపు సభ అంటూ నిప్పులు చెరిగారు హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగిసింది. ఈ సందర్భాంగా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు తెలంగాణ బిజెపి నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భాంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుని మొదలుపెట్టినప్పుడు కెసిఆర్ ఇది మనకు శ్రీరామరక్ష అన్నాడని.. ఇది ఒక మానవ అద్భుతం అన్న కేసీఆర్.. గత నాలుగు నెలలుగా అక్కడికి చీమను కూడా ఎందుకు పోనివ్వడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల దగ్గర పోలీసు బూట్ల సప్పుడు తప్ప.. ఎవరిని పోనివ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రజల రక్తపు చుక్కల మీద లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే.. మొన్నటి వరదకి మోటర్లు మునిగిపోయాయి అన్నారు. కెసిఆర్ దృష్టి అంతా తన కుటుంబం మీదే ఉందని, కెసిఆర్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు ఈటెల.