అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయంః ఈటల రాజేందర్

ఎన్ని కుట్రలు చేసినా బిజెపియే గెలుస్తుంది..

etela-rajender

హైదరాబాద్‌ః హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడు గజ్వేల్‌లోనూ జరుగుతుందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

బిఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు, కుట్రలు చేసినా గెలిచేది బిజెపియే అన్నారు. గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చునని, కానీ బిజెపి సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి బిజెపి సభకు రాకుండా చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు. కానీ వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టారన్నారు. ఈసారి గజ్వేల్‌లో అదే జరుగుతోందన్నారు.