బీజాపూర్లో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
బీజాపూర్: ఛత్తీస్గఢ్లో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం బీజాపుర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రారంతంలో జరిగింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించిన నక్సల్స్.. పోలీసులపై కాల్పులు జరిపారని, ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. ఘటనా స్థలంలో లభించిన మందుపాతరలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
మరోవైపు, బీజాపుర్తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లలో మృతిచెందిన నక్సలైట్ల సంఖ్య 34కు చేరింది. బీజాపుర్ జిల్లా, బస్తర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది.