పెందుర్తిలో దారుణం : వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన వర్కర్

పెందుర్తిలోని సుజాతనగర్‌ లో దారుణం జరిగింది. డబ్బుకోసం వృద్ధురాలిని చంపిన ఘటన నగరంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సుజాతనగర్‌కు చెందిన వరలక్ష్మి దంపతులు(70) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నెల క్రితం వారి దగ్గర వర్కర్ గా వెంకటేష్ అనే వ్యక్తి పనిలో చేరాడు. నెల రోజులుగా వారితోనే ఉంటూ..మంచి వ్యక్తిగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో వరలక్ష్మి ఇంట్లో డబ్బు ఉందని భావించిన వెంకటేష్‌.. నిన్న రాత్రి ఆమె ముఖంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లాడు.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం తో..ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వృద్ధురాలు నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ లోపలికి వచ్చి బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. వీటి ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.