లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేయగా.. విచారణకు హాజరైన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఈ సమన్లు జారీ చేయడం గమనార్హం.

గతేడాది ఏప్రిల్‌లో ఇదే విషయంపై సీబీఐ కూడా కేజ్రీవాల్‌కి నోటీసులు ఇచ్చింది. అయితే గతేడాదే దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు. కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఏది ఏమైనా ఆప్ పార్టీని నాశనం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యమని విమర్శించారు. ఇందుకోసం ఫేక్ కేసు సృష్టించడం సహా సాధ్యమైనవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపి ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందని దుయ్యబట్టారు. కాగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.