ఎనిమిదోసారి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ
న్యూఢిల్లీః మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసింది. గతంలో ఏడుసార్లు నోటీసులు జారీ చేయగా వివిధ కారణాలతో విచారణకు హాజరుకాలేదు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసిన కేంద్ర దర్యాఫ్తు సంస్థ మార్చి 4న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.
కేజ్రీవాల్ వరుసగా విచారణకు గైర్హాజరవుతుండటంతో దర్యాఫ్తు సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తనను కోర్టు ఆదేశిస్తేనే విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ నిన్న తేల్చి చెప్పారు. తమను ఇండియా కూటమి నుంచి నిష్క్రమింప చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమపై విచారణ పేరుతో ఒత్తిడి చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. కేజ్రీవాల్ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది.