ప్రముఖ ఆర్థిక వేత్త అభిజిత్ సేన్ కన్నుమూత

ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. సోమవారం రాత్రి 11 గంటలకు అభిజిత్ సేన్ కు గుండెపోటు వచ్చిందని, వెంటనే ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా.. ఆసుప్రతికి వెళ్లేలోపు తుదిశ్వాస విడిచారని ఆయన సోదరుడు ప్రణబ్ సేన్ తెలిపారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని, అప్పటికే ఆయన మరణించారని తెలిపారు. ఆయన మరణంపై రాజకీయ ప్రముఖులు, ఆర్థిక ,వ్యవసాయరంగ నిపుణులు పలువురు సంతాపం ప్రకటించారు.

72 ఏళ్ల అభిజిత్ సేన్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రముఖ నిపుణుడిగా కూడా అభిజిత్ సేన్‌కి పేరు. ఆయనకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మంచి పట్టు ఉంది. అటల్ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని తొలి ఎన్‌డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ ఖర్చులు, ధరల(CACP) కమిషన్‌కి చైర్మన్‌గా అభిజిత్ సేన్ వ్యవహరించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని తొలి ఎన్‌డిఎ ప్రభుత్వంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సిఎసిపి) ఛైర్మన్‌గా అభిజిత్ సేన్, జూలై 2000లో సమర్పించిన రిపోర్ట్‌ ప్రముఖంగా నిలిచింది.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొంది, నాలుగు దశాబ్దాల కరియర్‌లో అభిజిత్ సేన్ న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించేవారు. అంతకుముందు ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ , ఎసెక్స్‌లలో కూడా ఎకానమిక్స్‌ బోధించారు. వ్యవసాయ ఖర్చులు అండ్‌ ధరల కమిషన్ అధ్యక్షుడు సహా అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను ఆయన నిర్వహించారు. సేన్‌కు భార్య జయతి ఘోష్‌(దివైర్‌ డిప్యూటీ ఎడిటర్), కుమార్తె జాహ్నవి సేన్ ఉన్నారు.