మ‌నీశ్ సిసోడియా బ్యాంక్ లాక‌ర్‌ను ఓపెన్ చేసిన సీబీఐ అధికారులు

విచారణకు పూర్తిగా సహకరిస్తామన్న సిసోడియా

Delhi liquor policy case: CBI opens Manish Sisodia’s bank lockers in Ghaziabad

న్యూఢిల్లీః నేడు సీబీఐ ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా బ్యాంక్ లాక‌ర్‌ను ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా మనీశ్ సిసోడియాతో పాటు ఆయన భార్య కూడా బ్యాంకు వద్దే ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ కుంభ‌కోణం కేసులో సిసోడియాను సీబీఐ విచారిస్తున్న విష‌యం తెలిసిందే.

మరోవైపు, తమ ఎక్సైజ్ విధానంపై ఆరోపణలు రావడంతో దాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ కేసులో సిసోడియాతో సహా 15 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండానే కొత్త లిక్కర్ పాలసీని ఆప్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. అర్హత లేని విక్రేతలకు లైసెన్సులను కట్టబెట్టారని, లంచాలు తీసుకుని లైసెన్సులు ఇచ్చారని ఆరోపించింది. గత ఏడాది నవంబర్ లో కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు పాలసీని ఉపసంహరించుకుంది.

ఇంకోవైపు, రెండు వారాల క్రితమే సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలను నిర్వహించారు. నిన్న ట్విట్టర్ ద్వారా సిసోడియా స్పందిస్తూ… రేపు తన బ్యాంక్ లాకర్లను సీబీఐ అధికారులు తనిఖీ చేయబోతున్నారని… తన లాకర్లలో వారికి ఏమీ దొరకదని అన్నారు. ఆగస్ట్ 19న తన నివాసంలో 14 గంటల పాటు సోదాలను నిర్వహించారని… అయినా వారు గుర్తించింది ఏమీ లేదని చెప్పారు. తాను, తన కుటుంబం సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/