ఏపిలో హింసాత్మక ఘటనలపై వివరణ..సీఎస్, డీజీపీకి ఈసీ సమన్లు
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/05/Election-Commission-EC-jpg.webp)
న్యూఢిల్లీః ఏపీలో పోలింగ్ తర్వాత పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా స్పందించింది . ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవాహర్రెడ్డి, రాష్ట్ర డీజీపీ హారీష్కుమార్ గుప్తాకు సమన్లు జారీ చేసింది. ఏపీలో పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల సంఘం ముందు హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఆదేశించింది.
పల్నాడు, చంద్రగిరి, తిరుపతి,తాడిపత్రి, నంద్యాల జిల్లాలో జరిగిన హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ప్రశ్నిస్తూ వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పోలింగ్ జరిగిన రెండు రోజులు కావస్తున్న రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అల్లర్లు అదుపులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గురువారం వారిద్దరు ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్నారు.