లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ నోటిఫికేషన్‌ రిలీజ్ …

లోక్‌సభ తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌ జారీతో ఇవాళ్టి నుంచే నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు సమర్పించేందుకు మార్చి 27 చివరి తేదీ కాగా.. బీహార్‌ లో 27 న పండుగ ఉండడంతో వారికి 28 వరకు ఈసీ అవకాశం ఇచ్చింది.

మార్చి 28 న నామినేషన్‌ పత్రాల పరిశీలన ఉంటుందని, బీహార్‌ లో మాత్రమే మార్చి 30న ఉంటుందని అధికారులు వివరించారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 వరకు గడువు ఉండగా.. బీహార్‌ లో మాత్రం ఏప్రిల్‌ 2 వరకు అవకాశం ఉంటుందని ఈసీ వివరించింది. . ఈ నోటిఫికేషన్‌తో లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మొదటి షెడ్యూల్‌ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమౌతున్నట్లు అధికారులు వివరించారు.

తొలి విడతలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అందులో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్లోని 12 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 8 స్థానాలు, మధ్యప్రదేశ్‌లోని 6 స్థానాలు, ఉత్తరాఖండ్‌, అసోం, మహారాష్ట్రల్లోని ఐదేసి స్థానాలు, బీహార్‌లోని నాలుగు స్థానాలు, పశ్చిమబెంగాల్‌లోని మూడు స్థానాలు, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ రాష్ట్రాల్లోని రెండేసి స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌ దీవులు, జమ్ముకశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లోని ఒక్కో స్థానం ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్‌, జూన్‌ 1న తుది విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.