భారత్-చైనా ఘర్షణపై స్పందించిన అమెరికా
పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం.. అమెరికా

వాషింగ్టన్: లడఖ్లో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణల్లో ఓ కల్నల్ సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈవిషయంపై అమెరికా స్పందించింది. భారత్-చైనా మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులును నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోయారనే విషయం మా దృష్టికి వచ్చిందని, అమర జవాన్ల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని అమెరికా ప్రతినిధి చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత సమస్య శాంతియుత పరిష్కారానికి తాము మద్దతు ఇస్తామని తెలిపారు.
భారత్, చైనా సరిహద్దు సమస్యపై జూన్ 2న భారత ప్రధాని మోడి,అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో చర్చించారని వెల్లడించారు. లడఖ్లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్లు పరస్పరం దాడులు చేసుకోవడంతో 20 మంది భారత సైనికులు మరణించారు. 43 మంది చైనా సైనికులు మరణించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. గాల్వాన్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికులు రాళ్లు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో భారత కమాండింగ్ ఆఫీసర్ సహా 20 మంది సైనికులు మరణించినట్లు సైన్యం ప్రకటించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/