ఏపీకి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్..

ఏపీకి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ తో విజయవాడ కొత్త సీపీని నియమించింది ఈసీ. గతంలో విజయవాడ సీపీగా కాంతి రాణా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పీఎస్ఆర్ ఆంజనేయులు విధులు నిర్వహించే వారు. అయితే వారు అధికార పార్టీ వైసీపీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైసీపీకి అనుకూలంగా ఈ ఇద్దరు ఉన్నతాధికారులు పని చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాయి.

దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా విచారణ జరిపి.. నివేదికను సీఈసీకి అందించారు. ఆ నివేదిక ప్రకారం.. ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం మంగళవారం (ఏప్రిల్ 23) ట్రాన్స్ ఫర్ వేటు వేసింది. తక్షణమే వీరు విధుల నుంచి తప్పుకోవాలని.. ఎన్నికలు పూర్తయ్యేవరకూ వారికి ఎన్నికలకు సంబంధించిన విధులు ఏమీ అప్పగించొద్దని ఆదేశించింది.

ఈ ఇద్దరు అధికారుల స్థానాల్లోనే తాజాగా వేరే అధికారులను నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామక్రిష్ణలను నియమిస్తూ బుధవారం (ఏప్రిల్ 24) ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఏప్రిల్ 25 ఉదయం 11 గంటలకల్లా ఈ బాధ్యతలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.