బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనం తుక్కు తుక్కు అయ్యింది. భీమడోలు జంక్షన్‌ దగ్గర దురంతో ఎక్స్‌ప్రెస్‌ వస్తుండటంతో రైల్వే గేటును అక్కడి సిబ్బంది వేశారు. ఇంతలో బొలెరోలో వచ్చిన కొందరు వ్యక్తులు రైల్వే గేటును ఢీకొట్టారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వాహనం రైల్వే ట్రాక్‌పైకి వచ్చింది. భయంతో వాహనంలో వ్యక్తులు బొలెరో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.

ఆ బొలెరోను రైలు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో వాహనం తుక్కు తుక్కు అయ్యింది. కాగా, రైలు ఇంజిన్ దెబ్బతినడంతో దాదాపు ఐదు గంటలుగా రైలు ట్రాక్‌పైనే నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ట్రాక్‌పై నుంచి బొలెరోను తొలగించారు. అయితే, రైలు ఇంజిన్ దెబ్బతినడంతో మరో ఇంజిన్‌ను తెప్పిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు వాహనంలో వచ్చింది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. వారు దొంగలు అయి ఉండొచ్చని, పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు.