కాంగ్రెస్ లో చేరినట్టు వస్తున్న వార్తలను ఖండించిన డీఎస్

సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాడు. నిన్నటికి నిన్న తన తనయుడు సంజయ్ తో కాంగ్రెస్ ఆఫీస్ కు వచ్చి పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తండ్రి , కొడుకులు కాంగ్రెస్ లో చేరడం తో కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈరోజు డీఎస్ తాను కాంగ్రెస్ పార్టీ లో చేరలేదంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. తాను కాంగ్రెస్ లో చేరినట్టు వస్తున్న వార్తలను ఖండించారు.

తన చిన్న కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడని, ఆ సందర్భంగా తనకు కూడా కండువా కప్పారని, కానీ తాను పార్టీలో చేరలేదని డీఎస్ స్పష్టం చేశారు. తాను పార్టీలో చేరినట్టు భావిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి డీఎస్ లేఖ రాశారు. ఆ లేఖలో తన భార్య విజయలక్ష్మిని సాక్షిగా పేర్కొన్నారు.

తన భర్త డీఎస్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని విజయలక్ష్మి వెల్లడించారు. ఆయన గతంలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేశారని, ఆయనను రాజకీయాల కోసం వాడుకోవద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు దయ ఉంచి ఇటువైపు రావొద్దని, తన భర్తను ప్రశాంతంగా ఉండనివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక డీఎస్ తీరుఫై సీనియర్ నేత వి హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. “మా ప్రాబ్లంలో మేముంటే ఇదేంది లొల్లి! పార్టీలో చేరడం లేదని డీఎస్ నిన్ననే చెబితే సరిపోయేది కదా! మీ కుటుంబంలో సమస్య ఉంటే మీరు మీరు మాట్లాడుకోవాలి. ఓపక్క రాహల్ గాంధీ విషయంలో మేం బాధపడుతుంటే మధ్యలో మీ పంచాయితీ ఏంటి?” అని వీహెచ్ అన్నారు.