మద్యం మత్తులో రైల్వేట్రాక్‌పై కార్ నడిపిన మందుబాబు

కొంతమంది మద్యం మత్తులో ఏంచేస్తారో వారికీ అర్ధం కాదు..ఎటు వెళ్తున్నామో..ఏ పని చేస్తున్నామో..ఎం తాగుతున్నామో..చివరికి ఎక్కడ ఉన్నామో అనేది కూడా సోయి ఉండదు. తాజాగా ఓ మందుబాబు పీకల్లోతు మద్యం తాగి..రైల్వేట్రాక్‌ ను కాస్త అడ్డరోడ్డు అనుకోని కారు నడిపించాడు. కొంత దూరం వెళ్లాక ట్రాక్ లో కారు ఇరుక్కుపోయింది. ఆ తర్వాత తాగింది దిగింది. అంతే అయ్యో…అయ్యో అని అరవడం మొదలుపెట్టాడు. ఈ ఘటన కేరళలోని కన్నూరులో చోటుచేసుకుంది.

48 ఏళ్ల జయప్రకాశ్‌ ..ఈ నెల 18 న ఫుల్లుగా మందుకొట్టి కారెక్కాడు. ఇంటికి వెళ్తూ రోడ్డనుకుని రైల్వే ట్రాక్ ఎక్కేశాడు. రోడ్డంతా గతుకులుగా ఉంటే అడ్డరోడ్డు అనుకున్నాడు. అలా కొంతదూరం వెళ్లాక పట్టాలపై కారు ఇరుక్కుపోవడంతో అప్పుడు మనోడికి మత్తు దిగింది. మరోవైపు, ఇరుక్కుపోయిన కారును చూసిన రైల్వే గేట్ కీపర్, స్థానికులు పోలీసులకు, సమీపంలోని రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు.