కెసిఆర్ ను దెబ్బతీసేందుకు మూకుమ్మడి దాడి చేస్తున్నారుః గుత్తా

మోడీ కన్ను ఇప్పుడు తెలంగాణపై పడిందని వ్యాఖ్య

Gutta

హైదరాబాద్ః తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం కెసిఆర్ ను దెబ్బతీసేందుకు సమైక్యవాద శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. సంవత్సర కాలంగా ఈ పరిణామాలను చూస్తున్నామని చెప్పారు. కెసిఆర్ ను దెబ్బతీసేందుకు మూకుమ్మడి దాడి చేస్తున్నారని అన్నారు. కెసిఆర్ ను అడ్డు తొలగించి, తెలంగాణను మళ్లీ కబ్జా చేసేందుకు వస్తున్నారని విమర్శించారు.

2014లో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని గుత్తా విమర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలను కూల్చే కుట్రలతో అనిశ్చితకరమైన వాతావరణం ఉందని… తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. బిజెపి తన దత్తపుత్రిక షర్మిలతో పాదయాత్ర చేయిస్తూ కెసిఆర్ ను అప్రతిష్టపాలు చేయిస్తోందని మండిపడ్డారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా… ఐఏఎస్ అధికారులను కూడా జైలుకు పంపిన చరిత్ర షర్మిల కుటుంబానిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులను జైల్లో పెట్టేలా చేసింది దత్తపుత్రిక కుటుంబం కాదా? అని ప్రశ్నించారు.

తెలంగాణపై ఏపీ వాదుల కన్ను పడిందని… ఏపీలో ముఖం చెల్లక తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని గుత్తా విమర్శించారు. తెలంగాణపై దండులా విరుచుకుపడుతున్నారని అన్నారు. మళ్లీ దోచుకుందామని తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ప్రధాని మోడీ కన్ను ఇప్పుడు తెలంగాణపై పడిందని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/